Alert : తెలుగు రాష్ర్టాల్లో వాతావరణ మార్పులతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే, మరికొన్ని చోట్ల వడగాలులు, ఈదురు గాలుల బీభత్సం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఎండల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండగా, వర్షాలు కూడా అదే స్థాయిలో పడుతున్నాయి. రెండు రోజుల క్రితం గాలివాన ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కూడా. పిడుగులు పడి ఒకరిద్దరు ప్రాణాలొదిలారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ర్టాలను అలర్ట్ చేసింది.
ఏపీలో అనూహ్య వాతావరణం..
ఏపీలో వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో వానలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఎండలు కూడా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని చెప్పింది. అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, శుక్రవారం మెజార్టీ ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తప్పిన తుఫాను ముప్పు..
అయితే రాష్ర్టానికి తుఫాను ముప్పు తప్పినట్లుగా సమాచారం. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎండలు మాత్రం 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. రానున్న రోజుల్లో వడగాలులతో ఇబ్బందులు తప్పవని శుక్ర, శనివారాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్నది. గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, సత్యసాయి, అంబేద్కర్ కోనసీమ, తదితర జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.