- ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం

Choppadandi MLA Wife Sucide : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని అల్వాల్ పంచశీల కాలనీలోని వారి ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఎమ్మెల్యే మేడిపల్లికి భార్య రూపాదేవి మధ్య మనస్పర్థలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు.
ఏడాది కాలంగా కొంపల్లిలో పేట్ బషీరాబాద్ లోని దవేరియా విల్లాస్ లోని నివాసం ఉన్నారు. నెల రోజుల క్రితం హైదరాబాద్, అల్వాల్ లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12కి తమ నివాసాన్ని మార్చారు. ఎమ్మెల్యే సత్యం దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు యోజిత్ (11), కుమార్తె రిషిక శ్రీ (9) సంతానం. కొంతకాలంగా ఎమ్మెల్యే సత్యం దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయని సమాచారం. తాను చనిపోతున్నానని రూపాదేవి వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే సత్యంకు చెప్పగా.. ఆయన వెంటనే చొప్పదండి నుంచి కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే ఆల్వాల్ చేరుకునేలోగానే రూపాదేవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యుకు పాల్పడ్డారు. ఇంటి సమీపంలో ఉన్న లేనివో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు.
కాగా భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం దవాఖానలో స్పృహ తప్పి పడిపోయారు. కొంపెల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు మృతదేహాన్ని శుక్రవారం ఉదయం తరలించనున్నారు .ఆమె బలవన్మరణానికి గల కారణాలు ఇప్పటి దాకా తెలియరాలేదు.
ఎమ్మెల్యే సత్యం 2014, 2018 ఎన్నికల్లో చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు.