
Gali Janardhan Reddy was the only one who won in his entire party : కర్ణాటక రాజకీయాల్లో ప్రభుత్వాలనే శాసించిన ఘనుడు ఆయన. వ్యూహాత్మక రాజకీయాల సృష్టి కర్త.. ఆయనే గాలి జనార్దన్ రెడ్డి. కొన్నేళ్ల క్రితం ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీ (కేఆర్పీపీ)ని స్థాపించారు. 2023 ఎన్నికల్లో సత్తా చాటాలని చాలా రోజులుగా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతూ వచ్చారు. పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి గంగావతిలో, ఆయన భార్య గాలి లక్ష్మి అరుణ బళ్లారి నుంచి బరిలోకి దిగారు. పోలింగ్ కొనసాగుతుండగా జనార్దన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఫలితాలు వెల్లడయ్యాక తమ పార్టీకే ఒకవేళ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే.. కాంగ్రెస్ పార్టీ తమను మద్దతు కోరితే.. సిద్ధ రామయ్యను ముఖ్యమంత్రిగా చేసే పరిస్థితి ఉంటే మద్దతు ఇస్తా’ అని చెప్పారు. ఇప్పుడు ఈ మాటలు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
2012లో బీజేపీ హయాంలో గాలికి, సిద్ధ రామయ్యకు అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది.
ఆ సమయంలో గాలి ఆగ్రహంతో సభ సాక్షిగా దమ్ముంటే బళ్లారికి వచ్చి కాంగ్రెస్ సభ నిర్వహించాలని సిద్ధ రామయ్యకు సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన సిద్ధ రామయ్య బెంగళూర్ నుంచి బళ్లారికి పాదయాత్ర చేపట్టారు. అక్కడ సభ పెట్టి మరీ విజయవంతం చేసుకున్నాడు. 2013 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమయిన పరిణామాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. అంతటి వైరం ఉన్న సిద్ధ రామయ్యకు మద్దతిస్తానని జనార్దన్ రెడ్డి ఓటు వేసిన తర్వాత విలేకరులతో మాట్లాడడం కర్ణాటక రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది.
బళ్లారికి రాకుండా సీబీఐ ఆంక్షలు విధించడంతో గంగావతి నుంచే ‘గాలి’ వ్యూహాలు పన్నారు. అయితే బళ్లారిలో గాలి జనార్దన్ భార్య అరుణ జోరుగా ప్రచారం చేశారు. ఆమె వెంట జనార్దన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ఎం అలీఖాన్ పనిచేశారు. బీసీలు, లింగాయత్ లు, బలిజ, కమ్మ, ముస్లింలను కేఆర్పీపీ వైపు తిప్పడంలో అలీఖాన్ సఫలీకృతుడయ్యారనే చెప్పవచ్చు .
కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు.
గాలి మామ పరేమేశ్వర్ రెడ్డి, కూతురు బ్రహ్మణి, ప్రొద్దటూరు సుబ్బారెడ్డితో పాటు అనేక మంది
గాలి, ఆయన భార్య గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో గాలి అరుణ సఫలీకృతమైందనే చెప్పవచ్చు. కూతురు బ్రాహ్మణి తల్లికి తోడుగా ప్రచారం చేశారు. ‘నాన్న ఉంటే మేము రోడ్డుకు వచ్చేవాళ్లమే కాదు. నాన్న మాకు దూరంగా ఉన్నాడు. మీరే మాకు అన్న, అక్క, అమ్మనాన్నా’ అంటూ భావోద్వేగ ప్రసంగాలతో ఆకట్టకున్నారు. రాష్ట్రంలో 15 స్థానాల్లో కేర్పీపీ పోటీ చేయగా కేవలం ఆయన మాత్రమే విజయం సాధించారు. మిగిలిన 14 స్థానాల్లో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.






