- 20 రోజుల పాటు పోలీస్ సెక్షన్ 30 అమలు..

Pawan Kalyan Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనం ముందుకు వెళ్తున్నారు.. “వారాహి యాత్ర” కు సిద్ధం అయ్యారు.. ఈ నెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభం కానుంది.. అన్నవరం నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో సాగనుంది “వారాహి యాత్ర”.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అలర్ట్ అయ్యారు..
అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి నుండి ఈనెల 30వ తేదీ వరకు పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు డీఎస్పీ అంబికా ప్రసాద్.. ఇక, ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈనెల 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్రలో ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.. ఐదు బహిరంగ సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.. జూన్ 14న – ప్రత్తిపాడు కత్తిపూడి జంక్షన్ లో.. జూన్ 16న – పిఠాపురం ఉప్పాడ జంక్షన్ లో.. జూన్ 18న – కాకినాడ సర్పవరం జంక్షన్ లో.. జూన్ 21న – అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో.. జూన్ 22న – రాజోలు మల్కిపురం సెంటర్ లో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ.. ఇప్పటికే వారాహి యాత్ర ఏర్పాట్లు, యాత్ర సాగే రూట్లో తగిన ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు జనసైనికులు..






