Mahanadu 2023: నట సార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల సందర్భంగా టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. అధినేత చంద్రబాబుతో పాటు అతిరథమహారథులు తరలిరాగా, సభా ప్రాంగణం పసుపు వర్ణంలోకి మారింది. రాజమండ్రి గోదావరి తీరమంతా ఎన్టీఆర్ నామస్మరణతో మార్మోగింది. తెలుగు దేశం పార్టీ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఈ మహానాడుకు ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ నేతలందరూ తమ ప్రసంగాలను కొనసాగించారు.
తెలుగు నేల పులకించేలా, తెలుగు రాజసం ఉట్టిపడేలా, మహానాడు కార్యక్రమం కొనసాగుతున్నది. తెలుగు జాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆద్యంతం కార్యక్రమం సాగుతున్నది. తెలుగు దేశం పార్టీ స్థాపించాక చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పథకాలను గుర్త చేసుకున్న నేతలు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి ఎదురు లేదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రపంచస్థాయి నేత అని ఆయన తెలుగు నేల గర్వించే గొప్ప వ్యక్తి అని అంతా గుర్తు చేసుకున్నారు. నభూతో నభవిష్యత్ లా సాగుతున్న కార్యక్రమాన్ని మొదటి రోజు పార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ 2024 గెలుపు అవశ్యకతపై కూడా చర్చించారు.
రానున్న ఏడాది కాలం అతి ముఖ్యమని, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీని మరొకసారి అధికారంలోకి తెద్దామని వేదికపై ప్రసంగించిన వక్తలు పిలుపునిచ్చారు. రాష్ర్ట ప్రయోజనాల రీత్యా తెలుగు దేశం అధికారంలోకి రావడం ప్రస్తుతం అత్యవసరమని నేతలు తెలిపారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీనే తెలుగు ప్రజల గుండె చప్పుడని పేర్కొన్నారు. అయితే సభకు తరలివచ్చిన ప్రతినిధులు ఎన్టీఆర్ సేవలను. పార్టీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఏదేమైనా ఈసారి శతజయంత్యుత్సవాల సందర్భంగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న మహానాడు రాష్ర్టమంతా మార్మోగుతున్నది.