
మెగాస్టార్ చిరంజీవికి క్యాన్సర్ ఉందని సోషల్ మీడియాలో ఇటీవల రచ్చ రచ్చ అయ్యింది. దీంతో మెగా అభిమానులు తీవ్రంగా కలవరపాటుకు గురయ్యారు. తెలుగు ఇండస్ట్రీతో పాటు దేశ వ్యాప్తంగా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనను సొంత అన్నలా భావించే వారు ఉన్నారు. అలాంటి మెగాస్టార్ కు క్యాన్సరా..? అంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు చిరంజీవి. హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ కండెక్ట్ చేసిన క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమానికి మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. కార్యక్రమంలో ఆయనపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ మధ్య తనకు క్యాన్సర్ వచ్చిందని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయని వాటిని నమ్మి నా అభిమానులు తీవ్రంగా కలత చెందారని అన్నారు. అలాంటి జబ్బులు తనకు రాలేదని ఆయన చెప్పుకచ్చారు.
తనకు క్యాన్సర్ లేదని, కానీ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, వీటిలో క్యాన్సర్ లేని పాలిప్స్ను గుర్తించామని, వాటిని గుర్తించకుండా వదిలేస్తే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని సూపర్ స్టార్ వెల్లడించారు. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, నివారణకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని చిరంజీవి సూచించారు. తాను పెద్ద పేగు స్కోప్ పరీక్ష చేయించుకున్నానని, ఈ సమయంలో క్యాన్సర్ లేని పాలిప్స్ గుర్తించి తొలగించామని వివరించారు. జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్న కొన్ని మీడియా సంస్థలు తనకు క్యాన్సర్ ఉందని, చికిత్స చేయించుకున్నట్లు కథనాలు ప్రచురించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన శ్రేయోభిలాషుల్లో అనవసరమైన అయోమయం, బాధ కలిగిస్తున్నందున ఈ విషయాన్ని నిర్ధారించుకోకుండా ప్రచురించడం తనకు తీవ్రంగా బాధించాయని ఆయన పాత్రికేయులకు చెప్పారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే నిరాధార సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు







