Operation Sindoor : పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడి నిర్వహించింది. ‘ఆపరేషన్ సింధుర్’ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
బహవల్పూర్లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్కు చెందిన మదర్సాలే లక్ష్యంగా భారత ఆర్మీ ఈ మెరుపుదాడి చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం అక్కడ 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా కూడా ధృవీకరించినట్లు సమాచారం.
పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఈ దాడులు చేసింది. ఈ దాడులు పూర్తి కచ్చితత్వంతో జరిగినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.
ప్రభుత్వ ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది. తమ అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో “న్యాయం జరిగింది” (#JusticeHasBeenDelivered) అని పోస్ట్ చేసింది.
మరోవైపు, భారత దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. అయితే, దాడుల్లో ముగ్గురు మరణించారని, 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ పేర్కొంది. భారత మీడియాలో వస్తున్న ఉగ్రవాదుల సంఖ్యపై పాక్ భిన్నమైన ప్రకటన చేసింది. తాజా పరిణామాలతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.