
Pawan Kalyan : ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్పీకర్ ఎన్నిక సందర్భంగా మొదటిసారి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్నపాత్రుడు రావడం చాలా సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్అన్నారు. అసెంబ్లీ సమావేశాల రెండోరోజు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరం 16వ శాసన సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ముందుగా చంద్రబాబు ప్రసంగించిన అనంతరం పవన్కల్యాణ్ ప్రసంగించారు. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారని అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి పవన్ అన్నారు.
ఇప్పటివరకు ప్రజలు మీ ఘాటైన వాగ్దాటి చూశారని, ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని అన్నారు. గత ప్రభుత్వంలో వ్యక్తి గత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయంటూ పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ నేతల వ్యక్తిగత దూషణల కారణంగానే వారు 11 సీట్లకు పరిమితమయ్యారని పవన్ విమర్శించారు. భావంలో ఉన్న తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరంలేదని భాష మనసులను కలపడానికి కానీ విడగొట్టడానికి కాదన్నారు. భాష విద్వేషం రేపడానికి కాదని కేవలం సమస్యలను పరిష్కరించడానికని పవన్ కల్యాణ్అన్నారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు.. కానీ వివాదం సృష్టించడానికి కాదన్నారు. గత ప్రభుత్వం వ్యక్తి గత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందన్నారు. మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని పవన్ ఆకాంక్షించారు. ప్రజాసంక్షేమం కోసమే చర్చలు జరగాలని వ్యక్తిగత దూషణకు తావివ్వకుండా సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు.