Dasabdi Utsavas : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్ఆర్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం కేసీఆర్ వైఫల్యాలపై పోస్టర్ను ఆమె మీడియాకు విడుదల చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారని, ఈ దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విఫలం చేసి, ప్రతి ఒక్కరినీ మోసం చేసినప్పుడు ఈ వేడుకలకు నాయకత్వం వహించే హక్కు ఆయనకు ఉందా..? అని ప్రశ్నించారు.
ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయన ఇచ్చిన మాటను ఎందుకు నిలుపుకోలేదు..? కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఆయన అరాచకాలు, వైఫల్యాలను అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఈ పోస్టర్ ను విడుదల చేసింది’ అని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రూ.4.5 లక్షల కోట్ల అప్పుల్లోకి ఎందుకు నెట్టారని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పణంగా పెట్టి ఈ పదేళ్లలో ఎంత ఆస్తులు కూడబెట్టారు..? ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని ఎందుకు సీఎం చేయలేదని ప్రశ్నించారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడ..? తెలంగాణ అమరవీరులకు ఆర్థిక సాయం ఎక్కడ..? పోడు భూములను గిరిజనులకు పంపిణీ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు..? నిరుద్యోగులకు ఉద్యోగాలు, పింఛన్లు ఎక్కడ..? తొమ్మిదేళ్లు గడిచినా కేజీ టూ పీజీ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వీటికి కేసీఆర్ తప్పక జవాబు చెప్పాలని డిమండ్ చేశారు.