- వస్తాడా.. రాడా అని జోరుగా చర్చ
TDP invites Jr. NTR : టీడీపీ.. అన్న నందమూరి తారకరామరావు స్థాపించిన పార్టీ.. ఉమ్మడి రాష్ర్టంలో ఒక వెలుగు వెలిగిన పార్టీ.. తదనంతరం జరిగిన పరిణామాల కారణంగా నారా చంద్రబాబు నాయుడి చేతుల్లోకి వెళ్లింది. ఆయన కూడా పార్టీని దీటుగా నడిపించారు. 14 ఏండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మెజార్టీ నందమూరి కుటుంబం ఆయన వెంటే నడిచింది. పలు సందర్భాల్లో ఇది వెన్నుపోటు కాదని ఆయనకు అండగా నిలిచింది.
దూరంగా జూనియర్..
అయితే టీడీపీకి కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. గతంలో పలు ఎన్నికల సమయంలో జూనియర్ పార్టీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను పార్టీకి దూరం చేశాయని అంటుంటారు. అయినా తాత స్థాపించిన టీడీపీ వెంటే ఉంటానని, తనకు పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన పదేపదే చెబుతూ వస్తు్న్నారు. అయితే పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరవడం లేదు. నారా ఫ్యామిలీతో విభేదాల కారణంగానే ఆయన రావడం లేదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జూనియర్ రాకపోవడం సరికాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒకానొక దశలో చంద్రబాబు తర్వాత పార్టీని కాపాడే సత్తా జూనియర్ కే ఉందని మిక్కిలి అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే జూనియర్ మాత్రం ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనేనని, రాజకీయాల్లోకి ఇప్పుడే రాబోనని చెబుతూ వస్తున్నారు. భవిష్యత్ లో పరిస్థితిని కాలమే నిర్ణయిస్తుందని దాటవేస్తూ వస్తున్నారు.
శతజయంత్యుత్సవాలకు ఆహ్వానం..
మే 20 న కూకట్ పల్లిలో ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ నేత, ఎన్టీఆర్ సావనీర్ కమిటీ సభ్యులు టీడీ జనార్దన్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అయితే అంతకుముందు చంద్రబాబు ఆధ్వర్యంలో కమిటీ చర్చించి ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసింది. ఈ సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ, ఆయన సోదరుడు రామకృష్ణ కూడా ఉన్నారు. ఆ తర్వాత టీడీ జనార్దన్, రామకృష్ణ స్వయంగా వెళ్లి జూనియర్ ను ఆహ్వానించారు. వీరితో పాటు పురందరేశ్వరి, కళ్యాణ్ రామ్ సహా ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.
టీడీపీ ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఎన్టీఆర్ ఘన కీర్తిని చాటేలా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ నేతల ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురందరేశ్వరి వెళ్తారా.. లేదా వేచిచూడాలి.