Relief to Avinash : వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో అవినాష్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజులపాటు వాదనలు విన్న జడ్జి బుధవారం తీర్పు వెలువరించారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు అయితే షరతులు విధించారు.
సీబీఐ కి అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలని, ప్రతి శనివారం విచారణకు హాజరు అవ్వాలని సూచించారు. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీలులేదని ఆదేశించారు. రూ. 5 లక్షలతో రెండు పూచికత్తులు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి సహకరించకపోతే సీబీఐ అధికారులు మళ్ళీ కోర్టును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినా కోర్టును సంప్రదించవచ్చని తెలిపారు.
కాగా వైయస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు సీబీఐ చూపించినందునే హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిందని సమాచారం. కాగా అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు పై ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే సీబీఐ అరెస్టు చేయనుందనే వార్తల నేపథ్యంలో అవినాష్ కు తెలంగాణ హైకోర్టు తీర్పు పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు
మరోవైపు హైకోర్టు తీర్పుపై పలువురు న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు. అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇస్తే సిబిఐ విచారణకు ఆటంకం కలుగుతుందని విన్నవించినా, కోర్టు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుపై వైఎస్ వివేకా కూతురు సునీత ఎలా స్పందిస్తారని అంతా చర్చించుకుంటున్నారు.