Avinash bail petition : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పునివ్వనుంది. ప్రస్తుతం ఈ తీర్పు పైనే అటు ఏపీ రాజకీయాల్లో ఇటు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే న్యాయస్థానం ముందస్తు బెయిల్ కు నిరాకరిస్తే అవినాష్ ను అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే మూడుసార్లు అవినాష్ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో సీబీఐ తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనని ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో తన తల్లి చికిత్స పొందుతున్న దవాఖానలోనే ఉన్నారు. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందట పిటిషన్ దాఖలు చేశారు. అందుకు సుప్రీం నిరాకరించింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే వరకు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరారు.
అయితే తాజాగా హైదరాబాదులో తెలంగాణ హైకోర్టు సిబిఐ, వైఎస్ సునీత, అవినాష్ తరపు న్యాయవాదుల వాదనలు విన్నది. తీర్పును బుధవారానికి వాయిదా వేస్తూ నాలుగు రోజుల క్రితం ప్రకటించింది. అవినాష్ రెడ్డి చట్టానికి అతీతం కాదని పలుమార్లు విచారణకు పిలిచినా సహకరించడం లేదని, ఆయనను అదుపులోకి తీసుకుంటామని సిబిఐ చెబుతున్నది. ఆయన వెనక ఒక బలమైన శక్తి ఉందని, అందుకే విచారణలో అవరోధాలు ఎదురవుతున్నాయని సిబిఐ హైకోర్టు ముందుకు తీసుకెళ్లింది. అయితే బుధవారం వెలువడే తీర్పు తర్వాతే సీబీఐ తదుపరి అడుగులు వేయనుంది.