PM Modi Review : జమ్మూ కాశ్మీర్ లో జరిగిన తాజా ఉగ్రదాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. జెడ్డా నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసిన ప్రధాని, దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ దాడిని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఖండించారు. అమాయకులను చంపడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యాటకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒవైసీ తెలిపారు.
ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర పాలిత ప్రాంత ఉన్నతాధికారులు, అలాగే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. దాడి వివరాలు, భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. అనంతరం, దాడిలో గాయపడిన వారిని అమిత్ షా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
దురదృష్టవశాత్తు, ఈ ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మరణించారు. మృతుడిని మనీష్ రంజన్ గా గుర్తించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడి భద్రతా వర్గాల్లో విషాదాన్ని నింపింది. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అధికారులు పేర్కొన్నారు.