
Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అలాగే జనసేనకు చెందిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్కు పౌరసరఫరాల శాఖ, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్లకు సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖలను కేటాయించారు. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రివ్యూలు, సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్.. జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు వింటున్నారు. జనసేన పార్టీ ఆఫీసు వద్ద జనవాణి నిర్వహిస్తూ బాధితుల సమస్యలు వింటూ.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాంకేతికత సాయంతో తమకు కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించేందుకు మంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన చేపట్టిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్కాన్ చేసి సలహాలు పంపాలని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా రాష్ట్రప్రజలకు సూచించింది. ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదంటే లింక్ ద్వారా గూగుల్ ఫామ్ నింపాలని ఆ పార్టీ నేతలు సూచించారు. ఈ మేరకు క్యూఆర్ కోడ్, లింక్లను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఈ గూగుల్ ఫామ్లో పేరు, మొబైల్ నంబరుతో పాటుగా ఏ శాఖకు సంబంధించిన సలహాలు లేదా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారో తెలపాలి. ఆ తర్వాత ఏ జిల్లా అనేది వివరాలు నింపి సబ్మిట్ కొట్టాలి. దీని ద్వారా ఆయా శాఖలను ఎలా సమర్థంగా నిర్వహించాలన్న దానిపై ప్రజల నుంచి అభిప్రాయాలను జనసేన సేకరిస్తుంది. దీనిపై నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మంచి ఆలోచన అని.. ఇందులో మరికొన్ని అంశాలను కూడా చేర్చాలంటూ వారు కోరుతున్నారు. మరోవైపు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించి ఇప్పటికే అధికారులకు పలు సూచనలు చేశారు. తాజాగా చేపట్టిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.