సీఐ వేధింపులకు ఓ అమాయకుడు బలయ్యారు. హృదయ విదారకరమైన ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటు చేసుకుంది. చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన శ్యామ్ అనే వ్యక్తి స్థానికంగా రియల్ బ్రోకర్గా పని చేస్తుండేవారు. ఈయన కరీంనగర్ విద్యారణ్యపురిలో కుటుంబంతో కలిసి నివాసముంటూ..భూముల క్రయ,విక్రయ వ్యవహారాలు చూసేవాడు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ బ్యాంకు కాలనీలో నివాసముంటున్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారి గోపికృష్ణతో శ్యామ్ కు పరిచయడం ఏర్పడింది.
దీంతో గోపికృష్ణకు తన స్వంత గ్రామంలో భూమి కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. గోపికృష్ణ భూమి కొనుగోలు చేస్తే దాన్ని తిరిగి 5-6 నెలల్లో మళ్లీ అదనంగా రూ.10లక్షలకు అమ్మిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆఫర్ నచ్చడంతో గోపికృష్ణ భూపాలపట్నంలో శ్యామ్ను మధ్యవర్తిగా ఉంచి 20 గుంటల భూమిని రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్యామ్ గోపికృష్ణకు చెప్పిన గడువు ముగియడంతో ఆయన చెప్పిన ప్రకారం భూమిని అమ్మి తన డబ్బులు తిరిగి చెల్లించాలని కోరారు.
అయితే శ్యామ్ అనుకున్నట్లు గోపికృష్ణ కోనుగోలు చేసిన భూమి సకాలంలో అమ్ముడు పోలేదు. దీంతో శ్యామ్పై గోపికృష్ణ ఒత్తిడి పెంచారు. ఇచ్చిన గడువు ప్రకారం తన భూమిని అమ్మివ్వాలని పట్టుబట్టారు. అంతేకాకుండా ముందు చెప్పిన ప్రకారం అదనంగా పది లక్షల లాభాన్ని చూపించాలని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమి లేక శ్యామ్ అప్పు చేసి గోపికృష్ణకు రూ.3 లక్షలను సమర్పించుకున్నారు. అయినప్పటికీ గోపికృష్ణ నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో చివరకు గోపికృష్ణ వేధింపులు భరించలేని శ్యామ్ గురువారం స్వంత ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.