అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు చనిపోయారు. కెంటుకీలోని జాన్స్బర్గ్ హైవేపై ఈ నెల 24న ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నమాజ్-ఎ-జనాజా అని పిలువబడే అంత్యక్రియల ప్రార్థనలు సెయింట్ లూయిస్లోని దార్ ఉల్ ఇస్లాం మసీదులో జరిగాయి. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
ఇక గత నెలలో ఇండియాకి చెందిన నార్త్వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి సాహితీ.. యూఎస్ హైవే 71లో స్నేహితుడితో ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దాంతో తీవ్రంగా గాయపడిన సాహితీని మిస్సౌరీలోని సెయింట్ జోసెఫ్లోని మొజాయిక్ లైఫ్ కేర్కు తరలించారు. మరోక దురదృష్టకర సంఘటనలో న్యూజెర్సీలోని ప్లెయిన్స్బోరోలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీకాంత్ దిగాలా(39) అనే వ్యక్తి ప్రిన్స్టన్ జంక్షన్ స్టేషన్లో ఇంటర్ సిటీ రైలు డీ కొని చనిపోయాడు.