భారత సంతతికి చెందిన ప్రముఖుడు బాలేష్ ధన్కడ్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ఐదుగురు అమ్మాయిలను రేప్ చేసిన ఘటనలో అక్కడి కోర్టు సోమవారం ఆయనను ధోషిగా నిర్ధారించింది. కొరియన్ కు చెందిన ఐదుగురు యువతులకు మత్తు మందు ఇచ్చి వారిపై లైంగికదాడికి పాల్పడినట్లు తేల్చింది. మానవ మృగంగా కోర్టు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. నీచమైన రేపిస్ట్ అంటూ అక్కడి మీడియా రాసింది.
బాలేష్ ధన్కడ్ వృత్తి పరంగా డేటా ఎక్స్ పర్ట్. యువతులతో ఫ్రెండ్ షిప్ పెంచుకోవడం, వారిని ఇంటికి పిలవడం, హోటళ్లకు తీసుకెళ్లడం, వారికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి దించి ఆపై లైంగిక దాడి చేయడం, సదరు వీడియోలు, ఫొటోలను ఫోన్, అలారం వాచ్ లో దాస్తుంటాడని 39 అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి.
అక్కడి న్యాయమూర్తి మైకేల్ కింగ్ బెయిల్ నిరాకరించాడు. దీంతో బాలేష్, అతని భార్య కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మేలో కోర్టు ముందు హాజరవ్వాలి. దాదాపు ఏడాదిలోనే ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది.
తన వైవాహిక జీవితం సరిగా లేదని, అందుకే ఇలాంటి పని చేశానని బాలేష్ రోధిస్తూ చెప్పాడు. దీనికి తోడు కోర్టులని, లాయర్ ఫీజులని ఇలా చాలా ఆస్తి పోగొట్టుకున్నానని చెప్పాడు. 2018లో ఇతని వద్ద పోలీసులకు వీడియోలు లభించాయి. ఆ వీడియోలను చూసిన జ్యూరీ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.