Time for YCP : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు గడిచింది. ఇక ముందున్నది ఎన్నికల సంవత్సరమే.. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కలిసి ముందుకెళ్లాలని టీడీపీ, జనసేన ఒక ఒప్పందానికి వచ్చాయి. బీజేపీని కూడా కలిసి రావాలని కోరుతున్నాయి. అయితే రాష్ర్ట బీజేపీ నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, ప్రస్తుతం కేంద్రం చేతిలోనే ఆ నిర్ణయాధికారం ఉంది. మరోవైపు కేంద్ర పెద్దలు వైసీపీతో సఖ్యతను కొనసాగిస్తున్నారు. మరి ఈ దశలో వైసీపీ కి ఈ సమయం కీలకంగా మారబోతున్నది.
అయితే కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడి వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నది. మరోవైపు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం చేసుకుంటున్నది. అయితే వైసీపీ ఓడిపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయనే ప్రచారం జోరుగా మొదలు పెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఐప్యాక్ టీం పనిచేస్తున్నది. వైసీపీ పథకాలు, నిర్ణయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మిగతా పార్టీల తీరు, నెగిటివ్ ప్రచారం కూడా ఈ టీం చూసుకుంటున్నది. అయితే పలు వర్గాలను వైసీపీ పట్టించుకోలదేన్న టాక్ కూడా వ్యతిరేకతను తెలియజేస్తున్నది. కేవలం కొన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొనే వైసీపీ పథకాలు తెచ్చిందని, మిగతా వర్గాలకు మంచి చేసేలా ఎలాంటి పనులు చేపట్టలేదనే అభిప్రాయం వినిపిస్తున్నది.
అయితే రోజురోజుకూ వైసీపీలో కూడా పరిస్థితి మారుతున్నది. వై నాట్ 175 అన్న నేతలంతా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొంత వెనక్కి తగ్గారు. అయితే వైసీపీలో అధినేత జగన్ తో పాటు ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా ఏం బాగాలేదు. క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణుల ఆగడాలు శ్రుతి మించి పోయాయని టాక్ వినిపిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత పాజిటివ్ ఉన్నా, పట్టణాల వరకు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా వరకు ఓడిపోతారని టాక్ వినిపిస్తున్నది. ప్రజల్లో వీరిపై పూర్తి వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రత్యర్థి టీడీపీ బలం పుంజుకుంటున్నా, వైసీపీ అది గుర్తించడం లేదు. కేవలం సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాలో వారు ఉన్నారు.
మరోవైపు రాజధాని అంశం కూడా వైసీపీకి తలనొప్పే. ఏపీ రాజధాని ఏంటి అని అడిగితే ఏ ఒక్కరూ చెప్పలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం జగనే. పక్క రాష్ర్టాల్లో విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులకు ఇలాంటి ప్రశ్నలే ఎదురైనప్పుడు వారంతా ఎంతో బాధతో ఉన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నదని భావిస్తున్నారు. తల్లి రాష్ర్టాన్ని జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం చంపేస్తున్నారని భావిస్తున్నారు. మూడు రాజధానులంటూ వేసిన తప్పటడుగులు అలానే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో యువత దీనిపై గుర్రుగా ఉంటున్నారు. ఒక్క చాన్స్ అంటే తెచ్చుకున్న పాపానికి ఇలా జరిగిందేమిటా అని నెత్తి కొట్టుకుంటున్నారు. మరి 2024 ఎన్నికల్లో ఈ వ్యతిరేకత ఇలాగే కొనసాగితే, ప్రతిపక్షాల పొత్తులు ఖరారైతే, కేంద్రం తటస్థంగా ఉంటే ఇక జగన్ కు ఉన్నదంతా గడ్డుకాలమే. ఈ సారి అధికారం చేజారితే ఏం జరుగుతుందో తనకు తెలిసినంతగా ఆ పార్టీలో మరెవరికీ తెలియదు. మరి జగన్ ఇప్పటికైనా పార్టీ లైనప్ మార్చుకోవడంలో వేగం పెంచుతారో లేదో వేచి చూడాలి.