Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ ప్రతిపాదించనుంది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చేలా సవరణలకు లా కమిషన్ సిఫార్సు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే 2029 లో జరగనున్న 19 వ లోక్సభకు నిర్వహించే సార్వత్రిక ఎన్నికలతో పాటే దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహించే వీలు ఉంటుందని లా కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అందించనున్న ప్రతిపాదనలు ఇవే అని తెలుస్తోంది.
రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్లో ఒకే దేశం ఒకే ఎన్నికలు.. వాటి సుస్థిరత, లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు ఉండాలని లా కమిషన్ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని అసెంబ్లీలకు సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను భర్తీ చేసేలా కొత్త చాప్టర్ను రూపొందించాలని పేర్కొన్నట్లు సమాచారం.
జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ గడువులను 3 దశల్లో సర్దుబాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అంటే దేశంలోని కొన్ని రాష్ట్రాల శాసనసభల కాల వ్యవధిని పొడిగించడం.. మరికొన్నింటి రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధిని తగ్గించాలని పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ అవిశ్వాసంతో ప్రభుత్వాలు కూలిపోయినా లేదా హంగ్ ప్రభుత్వాలు ఉన్నా.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కీలక ప్రతిపాదన చేసింది. ఒక వేళ ఈ విధానం పని చేయకపోతే.. అసెంబ్లీ మిగతా కాలానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సిఫార్సులు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.