
YCP Ex MLA : వైసీపీ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపై కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మినగర్ లో వైసీపీ నాయకుడు సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడి ప్రోద్బలంతో వైసీపీ కార్యకర్తలు మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఏ2గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.