
కరోనా పుణ్యమా అని ఓటీటీ సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులోకి వచ్చింది. కారోనా కాలంలో ప్రతీ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేసేవారు నిర్మాతలు. లక్షలు, కోట్లు పెట్టి నిర్మించిన థియేటర్ల పరిస్థితి ఏంటని యజమానులు మొత్తుకోవడంతో నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి వచ్చింది. మూవీ రిలీజై 90 రోజులు (మూడు నెలలు) థియేటర్లలో ఆడిన తర్వాతనే ఓటీటీలోకి రావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా రిలీజ్ రోజే ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు నిర్మాతలు.
ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఏజెంట్’ ఓటీటీ హక్కులను విక్రయించినట్లు నిర్మాతలు తెలిపారు. అఖిల్ అక్కినేని నటించిన ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్ లలో రిలీజైంది. స్టయిలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ ను డిఫరెంట్ లుక్ లో ఈ మూవీలో చూపించారు. మళయాలం స్టార్ మమ్ముట్టి కీరోల్ ప్లే చేశారు. ఏజెంట్ బాస్ గా వ్యవహరించిన ఆయన నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
28న రిలీజైన ఈ సినిమా మొదటి నుంచి గందరగోళంలోనే ఉంది. సినీ క్రిటిక్ ఉమైర్ సింధు పలు విమర్శలు చేశారు. సినిమాలో అందరి నటన మెచ్చుకోదగ్గది అయినా అఖిల్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడని విమర్శలు గుప్పించారు. కానీ పబ్లిక్ టాక్ మరో విధంగా ఉంది. స్టయిలిష్ లుక్ తో అఖిల్ ఆకట్టుకున్నాడని సినీ అభిమానులు చెప్తున్నారు. గతంలో కూడా ఉమైర్ సింధు రివ్యూకు భిన్నంగా ప్రేక్షకులు స్పందించారు.
ఇదంతా పక్కనుంచితే ‘ఏజెంట్’ మూవీ ఓటీటీ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుందట. ఫ్యాన్సీ ధరకు సినిమాను సోనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే మూవీ మాత్రం వచ్చే నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.






