
Mirzapur-3 : ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకున్న వెబ్సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. ఇటీవల ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్ సీజన్-3 కూడా విడుదలైంది. విడుదలైన రోజు నుంచే ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా రికార్డు వ్యూస్ సాధించింది. ప్రైమ్ వీడియోలో రిలీజైన వారాంతంలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సిరీస్గా నిలిచింది. అంతేకాదు గతంలో వచ్చిన మీర్జాపూర్ 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఈ నెల 5న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్-3’ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.
స్ట్రీమింగ్ మొదలైన తొలివారం భారత్లో అమెజాన్ ప్రైమ్లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్గా నిలిచినట్లు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. గతంలో వచ్చిన ‘మీర్జాపూర్-2’ రికార్డును కూడా బద్దలు కొట్టిందట. మీర్జాపూర్ మూడో సీజన్ను 180కి పైగా దేశాల్లోని ప్రేక్షకులు వీక్షించారు. దాని ప్రారంభ వారాంతంలో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా 85 కంటే ఎక్కువ దేశాలలో టాప్ 10 ట్రెండింగ్ జాబితాలోఉండడం గమనార్హం.
మొదటి రెండు సీజన్లకు కొనసాగింపుగా సీజన్ 3కథ స్టార్ట్ అవుతుంది. గుడ్డూ (అలీ ఫజల్), గోలు (శ్వేత త్రిపాఠి) చేసిన దాడిలో మున్నా (దివ్యేందు) చనిపోగా.. కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) తీవ్రంగా గాయపడి కనిపించకుండా పోతాడు. దీంతో మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకునే క్రమంలో పూర్వాంచల్లో ప్రతి దాన్ని శాసించే శక్తిగా ఎదగాలనుకుంటాడు గుడ్డూ. కాలీన్ భాయ్ గుర్తులు లేకుండా చెరిపేందుకు ట్రై చేస్తాడు. మున్నాభాయ్ మరణంతో మాధురీ యాదవ్ (ఇషా తల్వార్) రాజకీయాల్లోకి అడుగు పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి కూడా అవుతుంది. కనిపించకుండా పోయిన కాలీన్ భయ్యాపై సింపథీని క్రియేట్ చేసి, ప్రజలకు చేరువ కావాలని భావిస్తుంది. గుడ్డూ దాడిలో గాయపడిన కాలీన్ను శరద్ శుక్లా (అంజుమ్ శర్మ) కాపాడి, ఆయన సాయంతో మీర్జాపూర్ కుర్చీని దక్కించుకోవాలనుకుంటాడు. మరి వీరిలో ఎవరు ‘కింగ్ ఆఫ్ మీర్జాపూర్’ అయ్యారన్నదే సీజన్-3 కథ.
‘మీర్జాపూర్ సీజన్ 3’కి గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే, ‘మీర్జాపూర్’ అభిమానులకు మేకర్స్ మరో భారీ బహుమతిని అందించారు. సీజన్-4 షూటింగ్ కూడా మొదలైనట్లు మేకర్స్ వెల్లడించారు. మూడో సీజన్లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్ తదితరులు నటించారు.