
Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తనను కలవాలనుకుని వచ్చే వారు ఇకపై బొకేలు, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. వాటి బదులు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని ఆయన కోరారు. తనను కలిసేందుకు వచ్చే వారు కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనుల నిండుగా కనబడేవి కాదు, పది మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడే వస్తువులు తీసుకువస్తే బాగుంటుందన్నారు. ఈ పిలుపు మేరకు జనసేన పార్టీల ఎంపీలు ముందుకొచ్చారు.. పవన్ కళ్యాణ్ను కలవడానికి వచ్చిన సమయంలో.. బొకేకు బదులుగా కూరగాయల బుట్టను తీసుకుని వచ్చి ఆయనకు బహూకరించారు. ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఎంపీలు బాలశౌరి, ఉదయ్లను పవన్ కళ్యాణ్ అభినందించారు.
బొకేలు, శాలువాలకు బదులు కూరగాయలు తీసుకువస్తే అవి అనాథ ఆశ్రమాలకు ఉపయోగపడుతాయన్నారు. బొకేలు, శాలువాలు కొనుగులు చేసే డబ్బులతో అన్నా క్యాంటిన్లకు కూడా సాయం చేయొచ్చన్నారు.. విగ్రహాలు, శాలువాలు తీసుకురావొద్దు.. వాటిని ఏం చేయాలో కూడా తెలియడం లేదన్నారు. ఎంపీలు మొదలు పెట్టారు.. అందరూ ఇలాగే చేయాలని కోరారు. బొకేలు, శాలువాలు బదులు కూరగాయలు మాత్రమే కాదని.. వారికి తోచిన విధంగా పేదలకు ఉపయోగపడే విధంగా ఏదైనా సాయం చేయవచ్చన్నారు.
శాలువాలు, బొకేలు బదులు ప్రజలు ఏదైనా సాయం చేసే ప్రయత్నం చేయాలని పవన్ ప్రజలను కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న వినూత్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్ర ప్రగతి కోసం, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంటులో చర్చించాలని జనసేన పార్టీ ఎంపీలకు సూచించారు. ప్రతి నెలా ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు.