- బీజేపీ కార్నర్ గా మిగతా పార్టీలకు చెక్

KCR master plan : తెలంగాణలో పాగా వేయాలన్న బీజేపీకి హైదరాబాద్ సెంటిమెంట్ దెబ్బకొట్టబోతున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలోని అర్బన్ ప్రాంతాల్లో మొదటి నుంచి కొంత పట్టున్నది. నార్త్ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువగా పోలింగ్ అవుతున్నది. అయితే దానిని పూర్తిగా సద్వనియోగం చేసుకోలేకపోతున్నది బీజేపీ. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. సికింద్రాబాద్ ఎంపీ స్థానంపై పట్టున్న బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్ శాతం పెంచుకుంది. దీంతో బీజేపీ కూడా హైదరాబాద్ తో పాటు చుట్ట పక్కల ప్రాంతాలపై కూడా దృష్టి సారించింది. తమకు కలిసి వస్తుందనుకుంటున్న సమయంలో బీజేపీకి అదే హైదరాబాద్ రూపంలో ఉపద్రవం రాబోతున్నది. దీనిని తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకొని రాష్ర్టవ్యాప్తంగా బీజేపీని దెబ్బకొట్టాలనే ఎత్తుగడ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
ఇదీ అసలు విషయం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ ను రాష్ర్ట విభజన సమయంలో రెండు రాష్ర్టాలకు పదేళ్లపాటు రాజధానిగా చేశారు. ఒక్కసారిగా ప్రాంతాల వారీగా వేరుకావడంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024 తో ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగియనుంది. అయితే ఇప్పటికీ ఏపీలో రాజధాని నిర్మాణం పూర్తికాలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి పరిపాలనా సౌలభ్యం కోసం తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. కానీ 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అంటూ కొత్త పాట పాడాడు. మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టుకు చేరింది. అసలు ఇప్పుడక్కడ రాజధాని సమస్య ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు. ఇదే సమయంలో ఉమ్మడి రాజదాని గడువు ముగింపు దశకు వచ్చింది.
మరో పది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలిసిన విషయం తెలిసిందే. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఆరెండు పార్టీల మధ్య పొత్తు కోసం కాదని, పక్కా రాజధాని లేనందున మరో ఐదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే ప్రతిపాదనను చంద్రబాబు అమిత్ షా ముందు ఉంచినట్లు సమాచారం. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బీజేపీ ఇందుకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక వేళ ఇదే నిజమైతే తెలంగాణ సీఎం దీనిని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాడని తెలుస్తున్నది.
విభజన చట్టం ప్రకారం రాజధాని గడువు ముగిసినందున మరోసారి ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు కేసీఆర్ అడ్డుపడొచ్చు అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఇందులో బీజేపీని కార్నర్ చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. 2014,2018 ఎన్నికల్లో ఇదే సెంటిమెంట్ ను రెచ్చగొట్టి టీడీపీ, వైసీపీలకు ఇక్కడ ఉనికి లేకుండా చేయగలిగాడు. ఆ రెండు ఎన్నికల్లో విజయం సాధించగలిగాడు. అయితే ఇప్పడు రాజధాని అంశాన్ని లేవనెత్తి బీజేపీని కార్నర్ చేస్తూ అటు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ లను ఒక్కసారిగా దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఎలాగూ ఈ అంశం తెరమీదికి వస్తుంది కాబట్టి ముందస్తుకు వెళ్లలేదని తెలుస్తున్నది. చంద్రబాబు ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రి అంగీకరిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..






