YCP MLA : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెల రోజులు కావొస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని రికార్డులను సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్గా మారారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లకే పరిమితమై అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓడిపోవడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది.
ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. వారంతా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నటుడు అలీ సైతం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యేలు చాలామంది వైసీపీని వీడడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే కరణం బలరాం 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.. మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే వైసీపీని వీడే ఆలోచనతో కరణం బలరాం ఉన్నారని టాక్. వైసీపీలో కొనసాగుతూ ఇబ్బందులు పడే కంటే పార్టీ మారితేనే మంచిదనే అభిప్రాయానికి ఆయన వచ్చారట. అయితే కష్ట సమయంలో పార్టీకి వెన్నుపోటు పోడిచి , వెళ్లిన కరణంను తిరిగి టీడీపీలోకి ఆహ్వానిస్తారా అనేది తేలాల్సి ఉంది.