Kannababu : సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓటమి తర్వాత ఆయన పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. క్యాడర్ కు దూరంగా ఉంటున్నారు.
ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కన్నబాబుకు జగన్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన మాత్రం పెద్దగా క్రియాశీలంగా కనిపించడం లేదు. మీడియా ముందుకు కూడా రావడం లేదు. వైసీపీకి భవిష్యత్తు లేకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరే అవకాశం లేకపోవడంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.