
AP Deputy CM : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల నిర్వహణలోనూ డిప్యూటీ సీఎం తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా వినాయక చవితిని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంనే వేదికగా ఎంచుకున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకోవాలని మంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని పండుగ జరుపుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందుకోసం మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై భారీగా అవగాహన కల్పించాలని పవన్ అధికారులను ఆదేశించారు. అలాగే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మట్టి వినాయక విగ్రహాలతో పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
వినాయక చవితి రోజు మట్టి గణపతిని పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అలాగే ఆలయాల్లో ప్రసాద వితరణకు ప్లాస్టిక్ కవర్లకు బదులు తాటి బుట్టలు, ఆకు బుట్టలను వినియోగించాలన్నారు. పిఠాపురం ఆలయాల్లో ఈ తరహా ప్రయోగం ప్రయోగాత్మకంగా చేపడతామని పవన్ కల్యాణ్ తెలిపారు. మరోవైపు అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించి వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలని ఇటీవల అధికారులకు పవన్ సూచించారు.
ఘన, ద్రవ వ్యర్థాలపై క్రియేటివ్ గా ఆలోచించి వాటిని తిరిగి వినియోగించుకుంటే పారిశుధ్య సమస్యను చాలా వరకు అధిగమించవచ్చని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పవన్ అధికారులను ఆదేశించారు. అలాగే పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో చెత్త నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు రెడీ చేయాలని కాకినాడ జిల్లా పర్యటనలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో చెత్త నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు.