
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య దూరం చీలికి చీలికి గాలివానలా మారుతోంది. ఉద్యోగులు ఎంతదాక వెళ్తారో చూద్దాం అన్నట్లు ఉంది ఏపీ ప్రభుత్వం తీరు… మీరు కోర్కెలు తీర్చాల్సిందే అంటోంది… ఉద్యోగ సంఘాల జేఏసీ..తాము గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదని తమకు రావాల్సిన డీఏ, పీఆర్సీ కోసమే పట్టుబడుతున్నామని మాకు రావాల్సినవి కూడా ప్రభుత్వం తీర్చడం లేదని ఉద్యోగులు మండి పడుతున్నారు.
ఉద్యోగులపెండింగ్ సమస్యల పైన ఉద్యోగ సంఘాలతో పాటుగా ట్రేడ్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఐక్యంగా సమర శంఖం పూరించాలని నిర్ణయించాయి. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవటానికి సిద్దపడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం పలు హామీలు ఇచ్చిందని, అమలులో మాత్రం చిత్తశుద్ది లేదని సంఘాల నేతలు ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు కలిసి వస్తామని కార్మిక సంఘాలు హామీ ఇచ్చాయి.ఉద్యోగుల సమస్య పై ఏపీజేఏసీ అమరావతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. అందులో పలు సంఘాల నేతలు ప్రభుత్వం పైన పోరాటానికి సిద్దం కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ది లేని చర్చలు చేస్తుందని ఆరోపించారు. సలహాదారులు, వాలంటీర్ల ఖర్చులు కలిపి ఉద్యోగుల కోసం ప్రభుత్వం రూ 90 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వేంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పడతామని ఏపీ ఎన్జీఏ సంఘం ప్రధాన కార్యదర్శి శివారెడ్డి హెచ్చరించారు.
త్వరలోనే తమ సంఘంలో చర్చించి ఉద్యమంలోకి వచ్చే అంశం ప్రకటిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం నేతలు ప్రకటించారు. సంక్రాంతికి ఇస్తామని డీఏ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. 16 డిమాండ్ల పై మినిట్స్ రికార్డు చేయించారని గుర్తు చేసారు. అందులో అయిదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఇస్తామన్నారని చెప్పారు. ఇప్పుడు అది అమలు అవుతుందా అనే సందేహం మొదలైందని ఏపీ ఎన్టీఓ సంఘ నేతలు అనుమానం వ్యక్తం చేసారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క డీఏ అయినా ప్రకటించారా అని నేతలు ప్రకటించారు. ఖజానా ఖాళీ అని సీఎస్ చెప్పారని నేతలు వెల్లడించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 50 రోజులుగా ఉద్యమం చేస్తున్నామని బొప్పరాజు చెప్పుకొచ్చారు. ఇక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇటు ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా వరుసగా జీవోలు జారీ చేస్తామని వెల్లడించిది. తాజాగా ఉద్యోగ సంఘాల వ్యాఖ్యల పైన ప్రభుత్వం ఏరకంగా స్పందిస్తుందో చూడాలి.






