
AP Minister Amarnath : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కెసిఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఏపీలో జగన్ ను గద్దెనెక్కించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన సహాయం అందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నా ఇప్పటివరకు సీఎంలు ఇద్దరు ఒక్క మాట కూడా అనుకోలేదు. అయితే ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అభివృద్ధి తమ వద్ద జరిగిందని తమ ప్రాంతంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని రాష్ట్రాల మంత్రులు గొప్పలు చెప్పుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.
అయితే ఇరు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కామెంట్లు ఎక్కువవుతున్నాయి. ఇటువైపు హరీష్ రావు సహా కొందరు మంత్రులు ఏపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటే.. అవతల వైపు నుంచి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఎదురు దాడి చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విమర్శలు మంత్రుల వరకే పరిమితమయ్యాయి.
అయితే తాజాగా సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే తాజాగా గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో భూముల రెట్లు విపరీతంగా పెరిగాయని, ఇక్కడ ఒక్క ఎకరం అమ్మితే ఏపీలో ఎకరాలు కొనుక్కోవచ్చని అన్నారు. దీనిపై ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఏపీలోని పార్వతీపురం వద్ద ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనవచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. తెలంగాణలో అభివృద్ధి కేవలం హైదరాబాద్ కే పరిమితమైందని చెప్పారు. కానీ ఏపీలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని, పక్క రాష్ట్రాల మీద మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తెలంగాణలో యువత, బీఆర్ఎస్ అభిమానులు ఆయనకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. గతంలోనూ అమర్నాథ్ రెడ్డి తెలంగాణ వైపు నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అభివృద్ధి. పరిశ్రమల రాక పై ఆయన వ్యాఖ్యలపై గతంలో ట్రోల్స్ కొనసాగాయి.






