
Telangana Secretariat : తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్లో పాత భవనంలో ‘వాస్తు’ సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపి కొత్త సచివాలయాన్ని నిర్మించారు. అయితే కొత్త భవనాన్ని ప్రారంభించి ఆరు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే పాలన సాగించాలి. బిల్డింగ్ కు వాస్తు దోషం ఉండడంతోనే కేసీఆర్ సీటు దిగాడని భావించిన రేవంత్ కొన్ని వాస్తు మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి సీఎం కాన్వాయ్ గేట్ 4 నుంచి సచివాలయంలోకి ప్రవేశిస్తుంది. కేబినెట్ మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఇదే గేటు నుంచి సచివాలయంలోకి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇతర ప్రాథమిక అధికారులు, వీఐపీలు ఆగ్నేయ ద్వారం 2 నుంచి భవనంలోకి రావాలని సూచించారు.
ఇది ఇలా ఉండగా, వెస్ట్ గేట్ 3 వద్ద మరమ్మతు పనులు పూర్తి కాలేదు. మరోవైపు, తూర్పు ద్వారం 1 శాశ్వతంగా మూసివేయబడింది. సచివాలయంలో పగటిపూట పనులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ వాస్తు సర్దుబాట్లన్నీ రాత్రిపూట చేస్తున్నారు. ఈ వాస్తు మార్పులు కేసీఆర్కు ఉపయోగపడలేదు. రేవంత్ రెడ్డికి ప్రయోజనం చేకూరుస్తాయో లేదో చూడాలి.
రేవంత్ నిర్ణయంతో కొందరు నాస్తికులు పెదవి విరుస్తున్నారు. ‘రెండు దఫాలుగా పాలించిన కేసీఆర్ పై విరక్తి చెందిన ప్రజలు ఆయనను కుర్చీ నుంచి దింపారని, కానీ ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల కాదని’ అంటున్నారు. కేసీఆర్ కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేసి సచివాలయం నిర్మిస్తే.. కొత్త సచివాలయానికి రేవంత్ మరింత ఖర్చుపెట్టి మరమ్మతులు చేయిస్తున్నాడని, ఇదేనమో బహూషా రాజుల సొమ్ము రాళ్లపాలంటే అంటూ విమర్శిస్తున్న వారు లేకపోలేదు.