
Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల నిర్వహణలో జరిగిన రూ.100 కోట్ల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి ఆర్కే రోజా. శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు రాష్ట్ర ఆత్యా-పాత్యా క్రీడా సంఘం సీఈవో ఆర్ డీ ప్రసాద్ సవాల్ విసిరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆడుదాం ఆంధ్రా ఈవెంట్ కు రూ.100 కోట్లు కేటాయిస్తే రూ. 100 కోట్ల అవినీతి ఎలా జరిగిందో తెలియడం లేదని మాజీ మంత్రి రోజా చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆ పోటీలకు గత వైసీపీ ప్రభుత్వం విడతల వారీగా రూ.130 కోట్లు విడుదల చేసినట్లుగా మావద్ద సమాచారం ఉంది. దీనికి సంబంధించి 26 జిల్లాల్లోని క్రీడాధికారులు, శాప్ కార్యాలయంలోని కీలక అధికారులపై కూడా విచారణ చేయాలని సీఎం చంద్రబాబు, క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాదరెడ్డిలను ఆయన కోరారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలతోపాటు ట్రిపుల్ ఐటీల్లోని క్రీడా కోటా ప్రవేశాల్లో భారీ అవినీతి జరిగింది. దీనిపై సీఐడీ విచారణ చేపట్టాలని గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మోడరన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రుత్తల అప్పలస్వామి, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య, ఎన్టీఆర్ జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి వెంకటేశ్ నాయక్ పాల్గొన్నారు.