
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎవరితో పొత్తులుండవని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు అని వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇవి కేవలం ఊహాగానాలేనని కొట్టి పారేశారు. అధిష్టానం ఇలాంటి ప్రతిపాదన ఏం లేదని చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ పెద్దలను కలిశారని, తెలంగాణలో పొత్తుపై ప్రతిపాదనలు తెచ్చారని వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కామెంట్స్ కీలకంగా మారాయి.
అయితే తమ పార్టీ పెద్దలను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ఆయన వెనుకేసుకొచ్చారు. నితీశ్, మమత సహా పలువురు కీలక నేతలు కేంద్ర పెద్దలను కలుస్తుంటారని అన్నారు. తాము అందరితో సత్సంబంధాలతో ముందుకెళ్తామని, బీఆర్ఎస్ లా కాదని చురకలంటించారు. విపక్షాలను కలుపుకొని ముందుకెళ్లడం బీజేపీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ సహా మరికొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే పొత్తులు ఉంటాయని ఇప్పటివరకు ఢిల్లీ సర్కిళ్ల నుంచి కూడా ఎలాంటి హింట్ రాలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ను కలిశారు. ఇది పూర్తిక అంతరంగిక సమావేశం. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను ఉద్దేశించి ఈ భేటీ జరిగినట్లు తెలుస్తు్న్నది. సుమారు గంట పాటు జరిగిన ఈ చర్చల్లో తెలంగాణ రాజకీయాల పై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. మరి పొత్తులపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. భేటీ అనంతరం చంద్రబాబు కూడా ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించలేదు. సైలెంట్ గా వెళ్లిపోయారు. ఇటు అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఎలాంటి విషయాలు బయటకు వెల్లడించలేదు.
తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఈ రెండు పార్టీల పొత్తులపై జోరుగా చర్చగా సాగుతున్నది. తెలంగాణలో బీజేపీకి టీడీపీ సహకరిస్తే, బీజేపీ ఏపీలో సహకరిస్తుందని టాక్ నడిచినట్లు అంతా అనుకుంటున్నారు. మరి తెలంగాణ చీఫ్ సంజయ్ మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభిమానులు ఇటీవల సంజయ్ చేసిన ఒక పోస్టును వైరల్ చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల సందర్భంగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు సంబంధించి, టీ బీజేపీ చీఫ్ సంజయ్ చేసిన పోస్టు అది. అయితే ఇక సంజయ్ టీడీపీతో టచ్ లో ఉన్నట్లేనని సమాచారం.






