
CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో సీబీఐ సోదాలు చేసింది. రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్ నివాసంలో తనిఖీలు పూర్తయ్యాయి. అక్కడ భారీగా బంగారం, నగదు పట్టుబడింది. 8 మంది సిబ్బందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సీబీఐ కోర్టుకు తరలించడానికి కార్యాలయం వద్ద 6 వాహనాలను సిద్ధం చేశారు. గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్, డీఎఫ్ఎం ప్రదీప్ బాబు, సిబ్బంది రాజు, ప్రసాద్, బాలాజీ సీబీఐ అదుపులో ఉన్నారు. నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సీబీఐ కోర్టుకు తరలించనున్నారు.
గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో భాగమైన ఆర్థిక విభాగంలో సికింద్రాబాద్ కు చెందిన సీబీఐ అధికారులు గురువారం దాడులు చేశారు. ఆర్థిక విభాగంలో పని చేస్తున్న సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ (డీఎఫ్ఎం) ప్రదీప్ బాబుతో పాటు మరికొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు గత మూడు రోజుల నుంచి గుంతకల్లులో మకాం వేశారు. కదిరి ప్రాంతంలో రైల్వే మోరీ పనులకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన గుత్తేదారులకు పనిని అప్పగించడానికి ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రదీప్ బాబుతో పాటు కొందరు సిబ్బంది డబ్బును డిమాండ్ చేసినట్లు సమాచారం.