
Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీంతో ఘాన్సీమియాగూడలో అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. చిరుత ఆచూకీ కోసం 20 కెమెరాలతో పాటు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో అడవి పిల్లి కదలికలు కనిపించాయి. చిరుతపులి సంచరిస్తుందనే అనుమానంతో అధికారులు ఈరోజు (బుధవారం) మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
శంషాబాద్ మండల పరిధిలోని ఘాన్సీమియాగూడలో శనివారం రాత్రి నర్సింహా అనే రైతు పొలంలో కుక్క, లేగదూడపై ఓ జంతువు దాడి చేసింది. ఈ దాడిలో లేగదూడ మృతి చెందింది. కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పోలీసులు, ఫారెస్టు అధికారుు పరిశీలించారు. చిరుత సంచరిస్తోందని గ్రామస్థులు భయాందోళన చెందుతుండగా అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.