
Lay Off 2024 : ఆఫ్టర్ కోవిడ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. 2019-20 లో వర్క్ ఫ్రం హోంలోకి వెళ్లిన కంపెనీలు ఆ తర్వాత సరైన ప్రాజెక్టులు లేక ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తున్నాయి. 2022లో అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి ప్రధాన కంపెనీలు వేలాది మంది ఉద్యోగాలను తొలగించడంతో టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు గణనీయంగా పెరిగింది.
2023 సంవత్సరంలో ఈ ధోరణి మరింత పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది (2024) 59 శాతం ఉద్యోగులను తొలగించింది. వివిధ సంస్థల్లో మొత్తం 2,62,915 మంది ఉద్యోగులను తొలగించినట్లు Layoff.ly తెలిపింది. ఆర్థిక మాంద్యం, కొవిడ్ సమయంలో మితిమీరిన ఒత్తిడి, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మక పునర్నిర్మాణం ఈ తొలగింపులకు కారణమని పేర్కొంది. అయితే నెలల తరబడి టెక్ పరిశ్రమలో భారీగా తొలగింపులు జరుగుతున్నప్పటికీ, 2024లో ఈ రంగం ఉద్యోగాల కోతలు మందగించే సూచనలు కనిపించడం లేదు.
Layoff.ly గణాంకాల ప్రకారం ఈ ఏడాది ప్రథమార్థంలోనే 337 టెక్ కంపెనీలు ఇప్పటికే 98,834 మంది ఉద్యోగులను తొలగించాయి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఇది ఉద్యోగాల కోతకు మరింత దారితీస్తుంది. ఉద్యోగం నుంచి తొలగిస్తామనే భయం ఐటీ ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తుండగా.. కొత్త, మరింత మోసపూరిత ధోరణి పెరుగుతోంది.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. భారతీయ ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) రంగం ఈ పద్ధతిని ఎక్కువగా ఆశ్రయిస్తోంది. ఇది బహిరంగపరచకుండా ఉద్యోగులను బయటకు వెళ్లమని సున్నితంగా ఒత్తిడి చేస్తోంది. 2023లో సుమారు 20 వేల మంది సాంకేతిక నిపుణులు ఇలాంటి అప్రకటిత తొలగింపుల వల్ల ప్రభావితమయ్యారని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎఐటీఈటీయూ) వెల్లడించింది.
ఈ సైలెంట్ లేఆఫ్స్ అంటే ఏంటి?
సైలెంట్ లేఆఫ్స్ లో మరో కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవాలని ఉద్యోగులకు 30 రోజుల వ్యవధి ఇస్తుంది. ఉద్యోగం దొరికితే కండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చి 30 రోజుల వేతనం ఇచ్చి పంపిస్తారు. ఉద్యోగం దొరకకపోతే తొలగిస్తారు. ఏఐటీఈయూ ప్రకారం.. ఈ పద్ధతి విస్తృతంగా ఉంటుంది. కంపెనీలు తమ ఉద్యోగులను నిశబ్ధంగా తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల ఉద్యోగి తిరగబడడం ఉండదు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) మరో నివేదిక ప్రకారం.. 2024, మొదటి 5 నెలల్లో ప్రముఖ భారతీయ ఐటీ సేవల సంస్థల నుంచి సుమారు 2,000 నుంచి 3,000 మంది ఉద్యోగులను నిశ్శబ్ధంగా తొలగించారు. కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు అనేక మార్గాలున్నాయని, ప్రతిఘటించే వారిని (వెంటనే) తొలగిస్తామని చెప్పారు. ఒకసారి రిలీవింగ్ లెటర్ మిమ్మల్ని ‘డిస్మిస్డ్’గా గుర్తించిన తర్వాత, ఆ వ్యక్తికి మరో ఉద్యోగం దొరకడం చాలా కష్టమవుతుంది.’ అని ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా మనీ కంట్రోల్ కు చెప్పారు.
లే ఆఫ్.. ఫైర్ ఒక్కటి కాదు..
లే ఆఫ్ అంటే ఫైర్ చేయడం కాదు. కంపెనీపై ఆర్థిక ఒత్తిడి పెరగడం వల్ల ఉద్యోగులను సున్నితంగా తొలగించే ప్రక్రియను లే ఆఫ్ అంటారు. దీని వల్ల కంపెనీ ఉద్యోగికి 30 (నెల) గడువు ఇస్తుంది. నెలలో మరో ఉద్యోగం దొరికే వరకు వేచి చూస్తుంది. ఉద్యోగం దొరికినా.. దొరకక పోయినా.. తొలగిస్తుంది. పైగా గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ కూడా ఇస్తుంది.
కానీ ఫైర్ అంటే అలా కాదు.. ఉద్యోగి తరుచూ తప్పులు చేయడం, క్రమ శిక్షణ పాటించకపోవడం, ఇతర ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన, పేలవమైన పని తీరు ఇవన్నీ ఉద్యోగిని తొలగించేందుకు దారి తీస్తాయి దీన్నే ఫైర్ అంటారు.
తొలగింపు ఏదైనా ఉద్యోగులు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు లే ఆఫ్ లో ప్రభావితం అవుతారు. ఎందుకంటే కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవాలంటే వీరినే లక్ష్య చేసకోవాలి. ఇప్పుడు టెక్ కంపెనీల ఉద్యోగులకు లేఆఫ్ సవాలుగా మారుతోంది. ఏడాదికేడాది గడుస్తున్నా కొద్ది టెక్ పరిశ్రమ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఉద్యోగులకు అండగా నిలిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.