
CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోం మంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం తరపున అండగా ఉండాలన్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా చూడాలని సూచించారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత ఈపూరుపాలెం బయలుదేరారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత హత్యకు గురైంది. ఈపూరుపాలెంలోని రైల్వే పట్టాల సమీపంలో యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు. మృతదేహంను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఒంటి పైన కొట్టిన దెబ్బలు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. బాధిత యువతి నెల్లూరు జిల్లా వాసి సుచరితగా గుర్తించారు.