
CM Chandrababu : ఏపీలో రహదారులకు తక్షణమే మరమ్మతులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం రహదారుల భవనాల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, పరిస్థితిపై ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించేదని, గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదని, వాహనదారులు, ప్రజలు ఐదేళ్లపాటు నరకం చూశారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని సీఎం సూచించారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో 4,151 కి.మీ. మేర రోడ్లపై గుంతల సమస్య ఉందన్నారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కి.మీ. మేర ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.