CM Jagan Rule AP : ఏపీ సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని జగన్ సంపాదించుకున్నారు. సొంత పార్టీ పెట్టుకొని ఒంటరిగా ప్రజాభిమానం తో ముందుకు వెళ్తున్నాడు.
2014 ఎన్నికల్లో పరాజయం తర్వాత జనాల్లోకి వెళ్లి 2019 ఎన్నికల్లో విజేతగా తిరిగి వచ్చాడు. ఏకంగా 151 సీట్లు గెలుచుకొని తిరుగులేని నేతగా నిలిచారు. పరిపాలనలోనూ తనదైన శైలితో ముందుకు వెళ్తున్నాడు. సంక్షేమ పథకాల అమలులో ఏపీని ఆదర్శంగా నిలుపుతూ సత్తా ఉన్న నేతగా పేరు సంపాదించుకున్నాడు. మరో 30 ఏళ్ల పాటు ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని స్పష్టంగా చెబుతున్నారు. అయితే జగన్ ఈ నాలుగేళ్లలో సాధించిందేమిటి..ప్రజలు ఏమనుకుంటున్నారు.. తెలుసుకుందాం.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. వారి అభ్యున్నతికి పలు పథకాలు ప్రవేశపెట్టి వారి కుటుంబంలో వెలుగులు నింపుతున్నాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి పేద విద్యార్థి విద్యాభ్యాసం కొనసాగేలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకుంటున్నాడు విద్యా దీవెన, వసతి దీవెన ఇలా ఎన్నో పథకాలు పేద ప్రజలను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా టైలర్లకు, జూనియర్ లాయర్లకు ఇలా అన్ని వర్గాలకు ఎంతో కొంత ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకు వెళ్తున్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నవరత్నాలు ప్రకటించి చేయూతనందిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పథకాలు చేరేలా చూశారు.
అయితే సంక్షేమంపైనే జగన్ ప్రధాన దృష్టి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆపవాదు మూటగట్టుకున్నారు. మరోవైపు అధికారంలోకి రాగానే ప్రత్యర్థులపై విరుచుకబడ్డారు. ప్రజా సొమ్ములతో కట్టిన ప్రజా వేదికను కూల్చివేశారు.ఇది జగన్ కు అతిపెద్ద మరక. రాజకీయంగా ముందుకు వెళ్లాలి కానీ ప్రజాధనంతో కట్టిన ఒక నిర్మాణాన్ని కూల్చివేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇప్పుడు టీడీపీ వాళ్లపై కొనసాగుతున్న దాడులు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రాకపోతే వైసీపీ పరిస్థితి ఇలాగే తయారవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అమరావతి రాజధాని విషయంలోనూ జగన్ విధానం విమర్శల పాలయింది. మూడు రాజధానుల పేరిట జగన్ తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేసింది.
చంద్రబాబు పై కోపంతో అమరావతిని శిథిలం చేసే కుట్రకు జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రజాగ్రహానికి గురయ్యాయి. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని జగన్ వ్యతిరేకించారు. చివరకు అన్న క్యాంటీన్లను కూడా మూసి వేయించారు. చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవడానికి పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసివేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇక వైకాపాలో పలువురు మంత్రుల తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉండగా, ఇక వైకాపాకు ఇది కీలక సమయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి, జనసేన చేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తేనే వైసీపీకి గెలుపు సాధ్యం అవుతుందని చెపుతున్నారు.