CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ అడుగులు ఎవరికీ అంతు పట్టవు. ఆయన తీసుకునే నిర్ణయాల వెనుక అత్యంత రహస్య మర్మాలు ఉంటాయి. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ను తీర్చిదిద్ది తన లక్ష్యాన్ని సాధించాడు. ఆ తర్వాత తమది ఉద్యమ పార్టీ కాదని ఇక ఫక్తు రాజకీయ పార్టీనేనని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇక ప్రజలు గుండెల్లో పెట్టుకున్న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి మరోసారి తనదైన స్కెచ్ తో ముందుకెళ్తున్నాడు. ఇక జాతీయ రాజకీయాలవైపు తన ప్రయాణమని చెప్పి ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు చెప్పాడు. కొందరు జాతీయ స్థాయిల నేతలను, కొన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆగమేగాల మీద కలిసి తన మనసులో మాట పంచుకున్నాడు. ఇక బీఆర్ఎస్ అడుగులు మొదలయ్యాయి.
ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం బీఆర్ఎస్ దృష్టి కేవలం మహారాష్ర్ట వరకే పరిమితమైంది. పక్కన ఉన్న తెలుగు రాష్ర్టం ఏపీలో కూడా పార్టీ మొదలుపెట్టి, తోట చంద్రశేఖర్ అనే సీనియర్ నాయకుడిని అధ్యక్షుడిగా నియమించారు. అక్కడ పార్టీ విస్తరణ బలోపేతం తదితర పనులు ఆయనకే అప్పగించారు. అంతే అక్కడివరకే ఇక ఆగిపోయింది.
మహారాష్ర్టలో మూడు సార్లు బహిరంగ సభలు నిర్వహించిన కేసీఆర్ ఏపీలో మాత్రం ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. కనీసం అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా వెళ్లలేదు. అక్కడ తన మిత్రుడు జగన్ కు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అంటూ మొదలుపెట్టాడని టీడీపీ కూడా ఇప్పటికే ఆరోపణలు గుప్పించింది. అయినా కేసీఆర్ మాత్రం ఇప్పటిదాకా ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇప్పటికే రాష్ర్ట విభజన అంశాలు, కృష్ణ జలాల అంశం రెండు రాష్ర్టాల మధ్య వివాదం అలాగే కొనసాగుతన్నది, ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఎలాంటి ప్రకటన చేసినా మొదటికే ముప్పు వాటిల్లుతుంది.
మహారాష్ర్ట సభలకు విపరీత స్పందన వస్తుండగా, కేసీఆర్ సమక్షంలో నిత్యం కొంత మంది నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మరి ఏపీలో మాత్రం ఏ హడావుడి కొనసాగడం లేదు. పార్టీలో చేరిన తోట చంద్రశేఖర్ కూడా కొంత సైలెంట్ అయినట్లుగానే కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ పార్టీ గ్రౌండ్ వర్క్ ఏమాత్రం షురూ కాలేదు. ఏదేమైనా రాజకీయ ప్రయోజనాలు లేనిదో కేసీఆర్ అడుగులు వేయరు. అలాంటిది మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతం ఇంటిని చక్కదిద్దుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక జాతీయ రాజకీయాల్లో తన చక్రం తిప్పే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి కేసీఆర్ ఏపీలో ఎప్పుడు అడుగుపెడుతారో.. అక్కడ ఎవరికి లాభం చేస్తారో.. ఎవరికి నష్టం చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.. ఇప్పటికైతే తన మిత్రుడు జగన్. రిటర్న్ గిఫ్ట్ పేరిట చంద్రబాబుకు తన దెబ్బ రుచిచూపించాడు. మరి మరోసారి ఎవరి వైపు కేసీఆర్ నిలుస్తారో చూడాలి.