CM Revanth : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పబోతోంది. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో రానున్నాయి. ఆరునూరైనా ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు రుణ మాఫీ నిధులు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ హామీని అమలు చేసేందుకు తీవ్రంగా పని చేస్తోంది. రైతు రుణమాఫీతో పాటు, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు కూడా దాదాపు రూ.40 వేల కోట్లు డబ్బు అవసరం. వీటిని సేకరించేందుకు అనే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.
రైతులకు రుణమాఫీని జూలై 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. రుణమాఫీకి సంబంధించిన గైడ్లైన్స్ ప్రతిపాదనను అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా బయటకొచ్చిన సమాచారం మేరకు కొందరికి రుణమాఫీ జరగదని సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ అమలు జరగదని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం 31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం చెబుతోంది.
2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీకి నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్.. జులై 15 నుంచి దశల వారీగా ఇది అమలు చేయబోతున్నారట. కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని, రెన్యువల్ చేసుకోలేదు. వారికి మాఫీ వర్తిస్తుందా? అలాగే ఒక్క కుటుంబంలో ఎంత మందికి రుణమాఫీ వర్తింపజేస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కార్ చెబుతుండటం రాష్ట్రంలోని పేద కుటుంబాలను సంతోష పెడుతోంది.