
Telangana CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడితో పోటీ తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన నేత. ఆయన అనుభవం గొప్పది. ప్రపంచ టెక్ దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకువచ్చిన నేత. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో చూపించిన ఘనుడు. ఆయనతో పోటీ అనేది అంతా ఆశామాషీ కాదు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఎలాంటి రాజధాని లేని ఏపీకి సీఎంగా ఉంటూ అమరావతిని రాజధానిగా ప్రకటించి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పెంచారు ఆయన.
‘బసవతారకం’ క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు (జూన్ 22) రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలందించేందుకు అన్నగారు (ఎన్టీఆర్) పెట్టిన ఈ హాస్పిటల్ నిస్వార్థంగా పేదలకు సేవలందింస్తుందని చెప్పారు. ‘ఏపీలో సీఎంగా చంద్రబాబు ఎన్నికవడం ఆనందంగా ఉందన్న ఆయన ఆయనతో పోటీపడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. నాతో పాటు రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాలి. డెవలప్ మెంట్ లో తెలుగు రాష్ట్రాలు పోటీ పడి ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తుందని ఆయన చెప్పారు.
హాస్పిటల్ సేవలు విస్తరించాలి..
క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పీడిస్తోందని ‘బసవతారకం’ ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ సేవల విస్తరణకు సీఎం రేవంత్రెడ్డి సహకారం కోరగానే వెంటనే అంగీకరించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. దాతల సహకారంతో హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుందని బాలయ్య బాబు అన్నారు. సేవలను మరింత విస్తరించాలన్నారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, డా.నోరి దత్తాత్రేయుడు పాల్గొన్నారు.