- టీడీపీ మేనిఫెస్టో పై నాయకుల్లో కలవరం
TDP manifesto : టీడీపీ మినీ మేనిఫెస్టో ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంటున్నది. మొన్నటి వరకు అభివృద్ధికే ప్రయారిటీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కసారిగా జగన్ ను కాపీ కొడుతూ సంక్షేమ రాగం అందుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఒక్కసారిగా పార్టీ స్టాండ్ మార్చడంతో ప్రజల్లోకి ఎలా వెళ్లేది అని టీడీపీ నాయకులు నిలదీస్తున్నారు. ఈ కాపీ మేనిఫెస్టోతో జనాల్లోకి వెళితే వైసీపీ ని ప్రమోట్ చేసినట్లవుతుందని పేర్కొంటున్నారు. దీంతో ఉన్న ఓటు బ్యాంకు కూడా వైసీపీ కే వెళ్తుందని ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ దూరమయ్యేందుకు జగన్ వేసిన పాచికలో బాబు పావుగా మారి బలయ్యాడని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ట్రాప్ లో పడి సంక్షేమ పథకాల పేరిట బాబు జగన్ ను మరింత బలోపేతం చేస్తున్నాడని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇన్ని రోజులు సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని అప్పుల్లో కి నెట్టాడని ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడు ఆ పథకాలకు మించి ఇస్తామంటూ చెప్పడం పరోక్షంగా జగన్ ను వెనకేసుకువచ్చినట్లే కనిపిస్తున్నది. చంద్రబాబు వైఖరితో రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారానికి దూరం కాక తప్పదని పార్టీలోని కొందరు సీనియర్ల మాటల్లో వ్యక్తమవుతున్నది..
ఏపీ సీఎం జగన్ అభివృద్ధి కన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలనే నమ్ముకున్నాడు. పథకాలు అమలు చేస్తూనే పన్నుల రూపేణా రాబడుతున్నారు. అయితే ఇది ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తున్నది. ఓ చేత ఇచ్చి మరో చేత రెండింతలు లాగుతున్నాడని జనాల్లో వ్యతిరేకత మొదలైంది. ఈ తరుణంలో టీడీపీ కూడా సంక్షేమబాట పట్టడంతో రేపు చంద్రబాబు వచ్చినా పన్నులతో పీల్చి పిప్పి చేస్తారనే ఆలోచన ప్రజల్లో కలుగుతున్నది. జగన్ తన వ్యతిరేకతను చంద్రబాబు రూపంలో తప్పించుకుంటున్నాడని పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే అంశాలను వదిలి బాబు మరోసారి జగన్ ట్రాప్ లో పడడంపై పార్టీ సీనియర్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయనుకుంటే..
2019 లో తమకు ప్రత్యామ్నాయం వైసీపీ అని భావించిన ఏపీ ప్రజలకు కొద్ది రోజుల్లోనే తెలిసొచ్చింది. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాల్సిన టీడీపీ ముందు చూపు లేకుండా మినీ మేనిఫెస్టో ప్రకటించి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నది. టీడీపీ మేనిఫెస్టో చూస్తుంటే ఉన్న కష్టాలకు తోడు కొత్త కష్టాలను తెచ్చుకున్నట్లేనని ప్రజలు భావిస్తున్నారు.
మిగతా వర్గాల మాటేమిటి.
సంక్షేమ పథకాలతో లబ్ధి పొందే వారిలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. ఆయా వర్గాల నుంచి అధికార పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం ఏమీలేదు. కానీ ఏపీలో ప్రధాన వర్గమైన రెడ్ల నుంచి వైసీపీ పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ ప్రధాన వర్గం వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంపై ఇప్పటి వరకైతే టీడీపీ దృష్టి సారించలేదు. ఇక రెడ్లు కూడా పరోక్షంగా జగన్ వైపు వెళ్లేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉన్న ఓటు బ్యాంకను కాపాడుకోవాల్సిన బాబు తాను కూడా జగన్ ను మించి సంక్షేమ పథకాలను అందిస్తామనడం వైసీపీ కి జై కొట్టినట్లు అయ్యింది. నిన్నటి వరకు విమర్శలు చేసిన నాయకులు, నేడు వాటినే తమకు అనుకూలంగా చెప్పడంలో ఎలా సఫలమవుతారనే ప్రశ్న టీడీపీలో ఉత్పన్నమవుతున్నది. సుధీర్ఘ రాజకీయ అనుభవశాలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పార్టీలో, సానుభూతిపరులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.