
Jairam Ramesh : లోక్ సభ ఎన్నికల్లో మణిపూర్ లోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్, మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ లోని రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. కల్లోలిత ప్రాంతంలో హస్తం పార్టీ విజయం సాధించడంపై సీనియర్ నేత జైరాం రమేశ్ హర్షం వ్యక్తం చేశారు.
‘‘క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్ ను ప్రధాని మోదీ ఇంతవరకు సందర్శించలేదు. ఆయన ప్రజలను పట్టించుకోలేదు. గతంలో రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రజలను సంప్రదించకుండా చేసింది. అనుమతించని ప్రాంతంలో కాంగ్రెస్ గెలుపు మోదీకి చెంపపెట్టు’’ అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఔటర్ మణిపూర్ లో కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన ఆల్ ఫ్రెడ్ కన్ంగమ్ ఎస్.ఆర్థర్ తన సమీప ప్రత్యర్థి, ఎన్ పీఎఫ్ కి చెందిన కచుయ్ తిమోతీ జిమిక్ ను 85,418 ఓట్ల తేడాతో ఓడించారు. ఇన్నర్ మణిపూర్ లో అంగోమ్ చా బిమోల్ అకోయిజం బీజేపీకి చెందిన తౌనోజం బసంతకుమార్ పై 1,09,801 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.