
Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు కొత్త వ్యాపార అవకాశాలను తెరుస్తాయి. ఉన్నత చదువులు చదివిన పిల్లలు ఉద్యోగాల కోసం దూర దేశాలకు వెళ్తున్నారు. కనీసం కన్నవారి చివరి చూపు కూడా చూసుకోలేనంత బిజీ అయిపోయారు. వారసులు అంత గొప్ప వాళ్లు అయిపోయారని మురిసిపోవాలో… లేక చివరి క్షణాల్లో పిల్లలు ఉన్నా అనాథగా మిగిలిపోయామని బాధపడాలో తెలియని దుస్థితి తల్లిదండ్రులది. ఆ మధ్య రాజమండ్రిలో ఓ కన్నీళ్లు వచ్చే ఘటన వెలుగు చూసింది. వృద్థాప్యం కారణంగా హాస్పిటల్లో చేరిన తల్లిదండ్రులకు సపర్యలు చేసేందుకు విదేశాల్లో స్థిరపడిన వారి వారసులు ఆయాలను ఏర్పాటు చేశారు. వారిద్దరూ రెండు మూడు రోజుల్లోనే చనిపోతారని తెలియడంతో.. ఆ దంపతుల కోరిక మేరకు గౌతమీ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరిపించాలంటూ పురోహితుడి బ్యాంకు ఖాతాకు వారిద్దరూ బతికుండగానే డబ్బులు వేశారు.
అంత్యక్రియల కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా చూపిస్తే అక్కడి నుంచే నివాళి అర్పిస్తామన్నారు. ఆ పిల్లల వైఖరిని స్వయంగా చూసిన ఆ ముసలివాళ్ల గుండెలు ఎంత ఆవేదన చెంది ఉంటాయో. సరిగ్గా ఇలాంటి వారి కోసమే ఇప్పుడు అంత్యక్రియలు కూడా పెద్ద వ్యాపార వస్తువుగా మారిపోయాయి. పుట్టిన వాడు గిట్టక మానడు కాబట్టి ఇది కూడా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఇందుకోసం అంతిమ సంస్కార్, గురూజీ, అంతేష్టి, లాస్ట్రైట్స్ వంటి పేర్లతో కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి.
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఏటా అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించి మార్కెటింగ్ చేసుకుంటాయి. అలాంటి అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్లో ఏర్పాటు చేసిన ఒక స్టాల్ సందర్శకులను ఆశ్చర్యపోయేలా చేసింది. ‘సుకాంత్ అంతిమ సంస్కార్’ పేరుతో అంత్యక్రియల కోసం ఏర్పాటైన ఒక కార్పొరేట్ కంపెనీ తాను అందించే సేవలను వివరిస్తూ పెట్టిన స్టాల్ ను అక్కడికి వచ్చిన వారంతా పెట్టిన కన్నార్పకుండా చూశారు.
ముంబైకి చెందిన రవీంద్ర పాండురంగ్ సోనావాలే, సంజయ్ కైలాష్ రాముగుడ్ అనే ఇద్దరు కలిసి సుకాంత్ ఫ్యూనరల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు. వివిధ మతాలు, కులాల వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడమే ఈ సంస్థ లక్ష్యం. అంత్యక్రియలకు అవసరమైన పాడె.. దాన్ని మోసే మనుషుల నుంచి పురోహితులు, మంగలి, రామ్ నామ్ సత్యహై అనే నినాదాలిచ్చే వారు, ఏడ్చేవారు వంటివన్నీ ఒక ప్యాకేజీ కింద అందిస్తున్నారు.
ప్రారంభం ప్యాకేజీ ధర రూ.37,500గా నిర్ణయించారు. అస్థికలను పవిత్ర నదుల్లో కలిపేదాన్ని బట్టి ప్రత్యేక రుసుములు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు వేలకు పైగా అంత్యక్రియలను నిర్వహించిన ఈ సంస్థ రూ.50 లక్షలకు పైగా లాభాలను నమోదు చేసింది. రానున్న కాలంలో ఈ సంస్థ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు చేరుకోనుందనే అంచనాలతో పలు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.