
Dangerous Tree : ఇంటి పరిసరాల్లో పచ్చటి మొక్కలను పెంచుకునేందుకు ఎవరైనా ఇష్టపడతారు. ఇంటి ఆవరణలో చెట్లు ఉంటే స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అందుకే ఇంటి ప్రాంగణాలు, పరిసరాల్లో మొక్కలు పెంచుతుంటారు. ఎలాంటి మొక్క అయినా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిస్తుంది. కానీ కొన్ని రకాల చెట్లు మాత్రం విష వాయువులను విడుదల చేస్తుంటాయి. అలాంటి మొక్క ఏపీలో ఎక్కడా కనిపించవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేయడం చేశారు. నాటిన మొక్కలను సైతం తొలగించాలని కాకినాడ కలెక్టర్ ఆదేశించడం సంచలనంగా మారింది.
రోడ్డు డివైడర్ల మధ్య ‘కోనో కార్పస్’ మొక్కలను తెలంగాణలో విరివిగా నాటారు. వీటి గురించి తెలియని కొందరు ఇళ్లల్లోనూ పెంచుతుంటారు. అందుకే నర్సరీల్లో కూడా ఈ మొక్కలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ మొక్కలు నాటొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ చెట్ల నుంచి వచ్చే గాలి వల్ల శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతుందని వైద్యులు గుర్తించారు. ఈ చెట్టు భూగర్భ జలవనరులను తోడేస్తుందని, ఒక్కసారి ఈ మొక్క నాటితే దీని వేరు 80 మీటర్ల లోతు వరకు వెళ్లి నీటిని తాగేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కోనో కార్పస్ చెట్ల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.
వీటిని తెలుగులో ఏడాకుల చెట్లు అంటారు. ఇంగ్లిష్ లో డెవిల్ ట్రీ అని కూడా సంబోధిస్తారు. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ మొక్కలకు పువ్వులు పూస్తాయి. ఈ పువ్వుల పుప్పొడి ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ క్రమంలో కాకినాడ ప్రాంతానికి చెందిన వారు ఈ మొక్కల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అటవీ శాఖ సమీక్షలో పవన్ అధికారులకు వివరించారు. ప్రజారోగ్యం దృష్ట్యా వాటిని తొలగించాలని ఆదేశించారు. గతంలో తన ఫామ్ హౌస్ లో ఈ చెట్లను పెంచానని.. వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడతో పాటు పరిసర ప్రాంతాల్లో 4602 మొక్కలు ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. వాటిని కూడా దశల వారీగా తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.