
Minister Kollu Ravindra : వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని గనులు, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం మచిలీపట్నంలో నియోజకవర్గ కూటమి నేతలతో భేటీ ఆయన భేటీ అయ్యారు. వివిధ అంశాలపై మాట్లాడారు. ఎన్నికల ముందు వైసీపీ నాయకులు భయపెట్టి తమతో రాజీనామాలు చేయించారంటూ రోజూ వందల మంది వాలంటీర్లు వస్తున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. వైసీపీ రాజకీయ స్వార్థంతో వారి జీవితాలతో ఆడుకుందని విమర్శించారు.
అనంతరం ఆయన కలెక్టరేట్లో బుధవారం జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు ప్రతిఇంటికి కుళాయిలు ఏర్పాటుచేసి సురక్షిత మంచినీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నెలకొని ఉన్న ప్రస్తుత సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
సాగునీటి కాలువలు, డ్రైనేజీల్లో పూడిక తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, సాగునీటి కాలువల నిర్వహణ పనులపై మంత్రి ఆరా తీశారు. 245పనులను రూ.55కోట్లతో చేసేందుకు గతంలోనే ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రావాల్సి ఉందని నీటిపారుదలశాఖ అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. వర్షాకాలం వచ్చినా ఇంతవరకు కాలువలకు మరమ్మతు పనులను ప్రారంభించకుండా ఉండటం ఏంటని మంత్రి ప్రశ్నించారు.
కృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేసేందుకు ఉన్న అవకాశాలపై వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో రూ.225 కోట్లతో 212పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. తాగునీటి చెరువులను తవ్వేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తనకు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటుచేసి రక్షిత మంచినీటిని అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారని మంత్రి తెలిపారు.