
YS Jagan : గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగించిన మారణహోమానికి తెరపడింది. అధికారం అండ చూసుకుని పేట్రేగిపోయిన జగన్ పతనం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసినప్పుడే ఖరారైంది. ఆ అక్రమ అరెస్టే వైసీపీ ప్రభుత్వానికి మరణశాసనం రాసినట్లు అయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీలో ఊరూవాడా వెల్లువెత్తిన నిరసన వైసీపీని అథ:పాతాళానికి తొక్కేసింది. ఆయనకు మద్దతుగా వెల్లువెత్తిన ప్రజాభిమానం, సానుభూతి వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులను మట్టికరిపించింది. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన అభిమానులు కదం తొక్కారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో మద్దతుగా ప్రదర్శనలు, ర్యాలీలు, సభలు నిర్వహించారు.
ఆయన విడుదలకు రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన అభిమానులు ప్రార్థనలు చేశారు. రూ.వేల కోట్ల అవినీతి, అక్రమ సంపాదన కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు మకిలి అంటించేందుకు సకల ప్రయత్నాలు చేశారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును 2023 సెప్టెంబరు 9న ఉదయం 6 గంటలకు డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలో అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో ఆయనను విజయవాడ తరలించారు. విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు భారీగా రోడ్లెక్కారు. తమ అధినేతను కాన్వాయ్లో తీసుకెళుతున్న పోలీసులను ఎక్కడిక్కడ అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి 52 రోజుల అనంతరం ఆయన విడుదలయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆయన అరెస్ట్ విషయం తెలిసి చాలా మంది చనిపోయారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో వారిని పరామర్శించి, అండగా నిలిచారు.
ఆయన అరెస్ట్ సమయంలో ఇంతవరకు ఎప్పుడూ ఇంట్లోంచి బయటకు రాని మహిళలు కూడా చలించి.. రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో, గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో అసాధారణ రీతిలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. పోలీసుల కళ్లుగప్పేందుకు సినిమాకో, షాపింగ్కో వెళుతున్నట్టుగా బయటకు వచ్చి, అందరూ అనుకున్న సమయానికి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అటు గుంటూరులోనూ గుజ్జనగుండ్ల నుంచి లాడ్జ్ సెంటర్ వరకు వేల సంఖ్యలో మహిళలు కొన్ని కిలోమీటర్ల దూరం నిర్వహించిన ప్రదర్శన నభూతో. పోలీసుల ఆంక్షల్ని, నిర్బంధాల్ని అధిగమించి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న రాష్ట్ర ప్రజలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని.. లక్షల సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడానికి అప్పట్లో చంద్రబాబుపై వెల్లువెత్తిన సానుభూతే కారణం.