
Fish Medicine : మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా అవసరమైన మందును సిద్ధం చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ దూద్బౌలిలోని వారి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేక వాహనంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి తీసుకొచ్చి పంపిణీ చేస్తారు.
జూన్ 8వ తేదీ శనివారం ఉదయం చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో చేపమందు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు (శుక్రవారం) తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్ట సాయికుమార్ పర్యవేక్షించారు. డిపార్ట్ మెంట్ నుంచి 1 లక్ష 60 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఇప్పటికే టోకన్లు తీసుకునేందుకు చాలా మంది తరలివచ్చారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆస్తమా రోగులకు బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చినా భోజనాలను అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాథ్ మశాట్టే పేర్కొన్నారు.