Salaries in AP : ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ మరింత క్షీణించిపోతున్నది. సంక్షేమ పథకాల పేరిట ఊదరగొడుతున్న సీఎం జగన్ వాటి అమలుకు ఎడాపెడా అప్పులు చేస్తున్నా పరిస్థితులు మాత్రం అదుపులో ఉండడం లేదు. తీసుకువచ్చిన అప్పులు , కేంద్రం విడుదల చేస్తున్న నిధులు ఎటు పోతున్నాయో తెలియడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం జీతాల అందక దిక్కులు చూడాల్సి వస్తున్నది.
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం రూ. 10,400 కోట్ల నిధుల్ని నేరుగా నగదు బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మరో 5వేల కోట్ల వరకూ ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంది. దీంతో జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి ఎటువంటి సమస్య తలెత్తదనుకున్నారు. కానీ ఒకటో తేదీ తర్వాత పరిస్థతి ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. రాష్ర్టంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో కేవలం 20 శాతం మందికి మాత్రమే జీతాలు పడ్డాయి. అయితే అవి కూడా ఆర్బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ కింద అప్పులు తీసుకుంటేనే వచ్చనిట్లు తెలుస్తున్నది. ఎప్పట్లాగే జీతాల కోసం.. ఎదురు చూస్తూ వచ్చినప్పుడు వాడుకోవాల్సిందే. తెచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నారన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు.
కేంద్రం రూ. పది వేల కోట్లు నగదు బదిలీ చేస్తే పండుగ చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా ఆర్థిక కష్టాల ఎదురీతకు ఎందుకు అవస్థలు పడుతుందో మిస్టరీగా మారింది. అప్పుల్లో ఏమైనా తిరిగి చెల్లించారా, లేక పాత బాకీల కింద కేంద్రమే ఆ నిధులు జమ చేసుకుందా అనేది తెలియడం లేదు. ఏ పనులూ చేయకుండానే తమ అనుకూల కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారా అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ కాదు. ప్రజలు పన్నుల రూపేణా చెల్లిస్తున్న డబ్బులతోనే ప్రభుత్వం నడుస్తున్నది. వాటి జమా ఖర్చులపై పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేయాల్సి ఉంది.
ఈ విషయంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తున్నాయి. తమపై అప్పుల కుప్పలు పేర్చి మరీ చేస్తున్న ఆర్థిక వ్యవహారాల్లో భారీగా అవినీతి జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే గానీ నిజాలేంటో ప్రజలకు తెలిసేలా లేవు. అయితే పాలకులు తమ పారదర్శకతను నిరూపించేందుకు సిద్ధంగా ఉంటుందా అనేది ఇప్పటికైతే ప్రశ్నలాగే మిగిలిపోతున్నది.