
Rohit-Kohli career : టీమిండియా రాబోయే రోజుల్లో ఆడే 12 మ్యాచ్ లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం తేల్చబోతున్నాయా అంటే అంటే అందుకు అవుననే సమాధానం వస్తుంది. ఈ 12 మ్యాచ్ లు వారిద్దరికీ పరీక్షగా మారబోతున్నాయి. రానున్న మ్యాచ్ లలో టీమిండియా ఆట పేలవంగా ఉంటే మాత్రం వారిద్దరి కెరీర్ కు ముగింపు తప్పదని సమాచారం.
పదేళ్లుగా టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగానే మారుతున్నది. ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్ సేన ఓటమిపాలవ్వడంతో.. భారత అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో ఐసీసీ వన్డే వరల్డ్కప్ జరగనుంది. ఈ ట్రోఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని టీమిండియా కసరత్తులు చేస్తున్నది. దీనికి సన్నద్ధమయ్యేందుకు కేవలం 12 మ్యాచ్లు మాత్తమే ఉన్నాయి.
టీమిండియా చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీ సాధించింది. మరోవైపు టీమిండియా చివరిసారిగా 2011లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంది. అయితే మరోసారి స్వదేశంలో వరల్డ్ కప్ ఆడే మరో అవకాశం వచ్చింది. దానికి ఎలాగైనా అందుకోవాలని భావిస్తున్నది. టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత రోహిత్ సేన ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీ వన్డే ఫార్మాట్లో ఉంటుంది. ఇందులో భారత్ ఫైనల్ చేరితే.. ఇక్కడ ఆరు మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది.
గ్రూప్ దశలో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత భారత్ సూపర్-4లోకి వెళితే.. ఇక్కడ మూడు జట్లతో మరో మూడు మ్యాచ్లు ఆడి ఫైనల్కు చేరితే ఒక మ్యాచ్. మొత్తం ఆరు మ్యాచ్లు.. దీని తర్వాత సెప్టెంబర్లో ఆస్ట్రేలియాకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టూర్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. దీని తర్వాత భారత్ వరల్డ్కప్లోకి ఎంటరవుతుంది. దీంతో వెస్టిండీస్ టూర్ నుంచి ఆస్ట్రేలియా సిరీస్ వరకు మొత్తం 12 వన్డేలు ఆడాల్సి వస్తున్నది.
వన్డే ప్రపంచకప్కు సన్నద్ధం అయ్యేందుకు భారత్కు ఈ మ్యాచ్లు చాలు. బలమైన ఓపెనింగ్ జోడి లేక మిడిలార్డర్ను సిద్ధం చేయడమే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందున్న సవాలు. శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ను చక్కదిద్దుతున్నాడు. అయితే ప్రస్తుతం అతడు ఇంకా కోలుకునే స్టేజిలో ఉన్నాడు. ఆసియా కప్ కల్లా శ్రేయాస్ ఫిట్గా ఉంటాడని బీసీసీఐ భావిస్తున్నది.
అటు రిషబ్ పంత్కు ప్రత్యామ్నాయ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ను మేనేజ్మెంట్ ఎంపిక చేయాల్సింది. కేఎల్ రాహుల్ ఉన్నా ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఈ 12 మ్యాచ్లలో సరైన టీమ్ ను ఎంపిక చేయాని రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నారు. అటు వరల్డ్ కప్లో ఒకవేళ భారత్ మరోసారి పేలవంగా ఆడితే టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శకం ముగిసినట్లేనని సమాచారం.






